Sri suktha Rahasyardha pradeepika
Chapters
శ్రీమాత్రేనమః. చదువరుల కొక్క మనవి. శ్రీ స్వామి శ్రియానంద నాధులవారిచే ఇందు బొందు పరుపఁబడిన శ్రీ షోడశాక్షరీ మంత్ర బీజము లాదిగా గల అంకిత పద్యమందు తెల్పినట్లు శ్రీమాతయే వారినోట శ్రీసూక్త రహాస్యార్థములఁ బల్కించినదని నిస్సందేహముగాఁ జెప్పఁగలను. శ్రీమదాంధ్ర భాగవతమున శ్రీపోతనామాత్యుఁడు ''పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుఁడట, నేబలికిన భవహరమగునట, పలికెద వేఱొండుగాథ బలుకగ నేలా'' యని చెప్పలేదా? వీరి శ్రీసూక్త రహస్యార్థ వివరణములను సావధానముగాఁ బరికించినచో తమ దీక్షానామమునకుఁ దగినట్లు, ''స్వయంతీర్ణః పరాంస్తారయతి'' యన్న రీతిగా, ఎంతయో పాటుపడి శ్రీయనెడి శైలాగ్రముజేరి, ఆనంద సుఖము ననుభవించుచు యిట్టి మహోత్కృష్ణకృతుల మూలకముగాను, ''ఉపదేశ'' మూలకముగాను యితరులకు తరణోపాయమును గల్పించు చున్నారని తేటపడక మానదు. ప్రతిఫలాపేక్ష రహితులైన యిట్టి మహోత్తమ సద్గురుల నాశ్రయించి, ఎచటనోగాక తనయీ దేహమందే బాహ్య దృష్టికిఁ గోచరముకాక అతి గోప్యముగా నుండు శ్రీశైలశిఖర మెవ్వఁడనన్యభక్తిచే, కష్టవంచనలేక, సాధించి కనుగొనునో అట్టివానికి పునర్జన్మ లేదని చెప్పుటలో ఆశ్చర్య మావంతయును లేదు. శ్రీవారికి ఎల్లశ్రేయముల నొసంగి వారి సదాశయముల సదా ఫలింపఁజేయుమని శ్రీమాతను ప్రార్థించు చున్నాను. చిత్తూరు, ఇట్లు, శిష్యపరమాణువు, 24-8-53. M.P. రామారావు.